పసిబాల్యంపై యాచక మాఫియా దందా!

4 Apr, 2022 23:16 IST|Sakshi

చిన్నారులు, పేద మహిళలే గురి 

రోజువారీ అద్దె, లేదా శాశ్వతంగా కొనుగోలు

పేట్రేగిపోతున్న దళారులు

బనశంకరి (బెంగళూరు):  అనాథ మహిళలు, పేద కుటుంబాల పిల్లలే పెట్టుబడిగా యాచక మాఫియా నగరాల్లో పేట్రేగిపోతున్నది. వీరి ఆర్థిక, సాంఘిక పరిస్థితులను ఆసరా చేసుకున్న కొంతమంది సంఘ విద్రోహశక్తులు వారితో భిక్షాటన చేయిస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. బెగ్గింగ్‌ మాఫియా ద్వారా ఏడాదికి దేశవ్యాప్తంగా రూ.260 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయంటేనే.. ఈ అనాగరిక వ్యవస్థ సమాజంలో ఏ మేరకు వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

అద్దెకు పేద రాష్ట్రాల పిల్లలు..
కొంతమంది దళారులు ఉత్తరప్రదేశ్, ఒడిశా, బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, అసోం, తమిళనాడు గ్రామీణ ప్రాంతాల నిరుపేద కుటుంబాలను కలిసి వారి పిల్లలను రోజువారి, లేదా శాశ్వతంగా కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని నగరాలకు పిలిపించి నెలకు కొద్దిమేర అద్దె ఇచ్చి పసిపిల్లలను తీసుకుంటారు. ట్రాఫిక్‌ రద్దీగా ఉండే ప్రముఖ నగరాలు, జనసందడి కలిగిన ప్రాంతాలు, జాతర, ఉత్సవాలు, పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలో ఈ పిల్లలతో భిక్షాటన చేయిస్తారు.

ప్రభుత్వాల పునరావాసం..
భిక్షాటన మాఫియాలో చిక్కుకున్న పిల్లల ఆచూకీని ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు కనిపెట్టి ప్రభుత్వ పరంగా పునర్వసతి కల్పిస్తున్నారు. భిక్షాటన దందాకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, పిల్లలను, మహిళలను ఈ దందాలో వినియోగిస్తున్నట్లు తెలిస్తే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు