భార్య మీదకు విసిరిన రాయి తగిలి బిడ్డ మృతి

20 Jun, 2022 21:23 IST|Sakshi

సాక్షి, చెన్నై: భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలో భార్యపై విసిరిన రాయి ఆమె చేతిలో ఉన్న బిడ్డకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు.. తేని జిల్లా దేవదాన పట్టికి చెందిన నాగరాజు (23). ఇతను తన బంధువైన నవీన (20)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నవీన గర్భం దాల్చిన సమయంలో కట్నం తెమ్మని ఆమెను వేధించేవాడు. దీంతో ఆమె రాయప్పన్‌పట్టిలో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో నెల రోజులకు క్రితం నవీనకు మగబిడ్డ పుట్టాడు. కోపంతో ఉన్న నాగరాజు భార్య బిడ్డను చూడడానికి అత్త ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యతో గొడవ పడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోతూ.. అక్కడ ఉన్న రాయిని తీసుకుని నవీనపై విసిరాడు. ఆ రాయి ఆమె చేతిలో ఉన్న బిడ్డకు బలంగా తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన బిడ్డ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.   

మరిన్ని వార్తలు