మా నాన్నను విడిపించండి

14 Feb, 2022 06:07 IST|Sakshi

సుప్రీంకోర్టులో అక్కాతమ్ముడి పిటిషన్‌

న్యూఢిల్లీ: భారతదేశంలో జన్మించిన తమ తండ్రిని అన్యాయంగా పాకిస్తాన్‌ జాతీయుడిగా నిర్ధారించి జైలుశిక్ష విధించారని, శిక్షాకాలం ముగిసినా నిర్బంధించారని, ఆయనను విడిపించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన అక్కాతమ్ముడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మొహమ్మద్‌ ఖమర్‌(62)ను యూపీలోని మీరట్‌లో 2011 ఆగస్టు 8న పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్‌ జాతీయుడైన ఖమర్‌ అక్కడి పాస్‌పోర్టుతో భారత్‌కు వచ్చాడని, వీసా గడువు ముగిసినా ఇంకా దేశంలో ఉంటున్నాడని కేసు నమోదు చేశారు.

నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతడికి మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. 2015 ఫిబ్రవరి 6న జైలుశిక్ష ముగిసింది. అతడిని తీసుకెళ్లేందుకు పాకిస్తాన్‌ నిరాకరించడంతో అధికారులు 2015లో∙లాంపూర్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించారు. దీంతో ఖమర్‌  ఏడేళ్లుగా నిర్బంధంలోనే కొనసాగుతున్నాడు. భారతీయురాలిని వివాహమాడిన ఖమర్‌కు భారత్‌లోనే ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. తమ తండ్రి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, తక్షణమే విముక్తి కలిగించాలని ఖమర్‌ కుమార్తె, కుమారుడు తాజాగా సుప్రీంను ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు