చైనాపై కన్నెర్ర జేసేదెప్పుడు ?

16 Dec, 2022 05:34 IST|Sakshi

లోక్‌సభలో ప్రధాని మోదీని ప్రశ్నించిన అధీర్‌ రంజన్‌

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికుల చొరబాటు యత్నంపై ప్రధాని మోదీ వైఖరిని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం లోక్‌సభలో జీరో అవర్‌ సందర్భంగా రంజన్‌ ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘ భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తుంటే మోదీ సర్కార్‌ మాత్రం అదే దేశం నుంచి దిగుమతులను పెంచడంపై శ్రద్ధపెట్టింది.

ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రి సర్వర్లను హ్యాక్‌ చేసింది చైనా హ్యాకర్లేనని ప్రముఖ జాతీయపత్రికలో గురువారం కథనం వెలువడిన నేపథ్యంలో ఈ అంశాలపై కేంద్రప్రభుత్వం లోక్‌సభలో శ్వేతపత్రం జారీచేయాల్సిందే. ఒక వైపు హ్యాక్‌ చేస్తూ, మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో చొరబడుతున్న చైనాపై ప్రధాని మోదీ ఎప్పుడు కఠిన చర్యలకు దిగుతారు? అని అధీర్‌ రంజన్‌ ఆగ్రహంగా మాట్లాడారు. ‘ అమెరికాతో భారత వాణిజ్యం తగ్గిన ప్రతిసారీ చైనా లాభపడుతోంది. మోదీ సర్కార్‌ హయాంలో చైనా నుంచి దిగుమతులు మరింత పెరుగుతుంటే చైనా విషయంలో మోదీ వైఖరి చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. దిగుమతులు పెంచేసి ఆ దేశానికి లబ్ధిచేకూరుస్తుంటే మరి చైనాపై మోదీ కన్నెర్రజేసేది ఎప్పుడు ? ’ అని అధీర్‌ రంజన్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు