అన్‌లాక్ 5.0: థియేటర్లకు అనుమతి

30 Sep, 2020 20:47 IST|Sakshi

న్యూఢిల్లీ: అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా మినహాయింపులు ఇచ్చే అంశాలను మార్గదర్శకాల్లో పేర్కొంది. సెప్టెంబర్ 30తో అన్‌లాక్ 4.0 గడువు ముగియడంతో మరిన్ని సడలింపులతో తాజా మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీట్లతో సినిమా థియేటర్లు, మల్లీ ప్లెక్సులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు/మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. క్రీడాకారుల కోసం స్విమ్మింగ్‌పూల్స్‌కు తెరిచేందుకు అనుమతినిచ్చింది. అంతేగాక, అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు తెరిచే అంశంపై నిర్ణయాన్ని తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది. ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగించవచ్చని తెలిపింది. ఇక కోచింగ్‌ సెంటర్లు, కాలేజీలు దశల వారీగా తెరిచే అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. ఇక కంటైన్మెంట్‌ జోన్లలో అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగనుంది. రాష్ట్రాల మధ్య రాకపోకల్లో ఎలాంటి నిబంధనలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. (చదవండి: ఎలన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు