ఒక్కరోజు ముందుగానే సీజేఐకి వీడ్కోలు.. ఆఖరి విచారణ లైవ్‌లో!

7 Nov, 2022 06:56 IST|Sakshi
జస్టిస్‌ లలిత్‌ సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన నాటి దృశ్యం

సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నే తృత్వంలోని ప్రధాన ధర్మాసనం జరిపే చివరి సారి విచారణ ప్రత్యక్ష ప్రసారం కానుంది. జస్టిస్‌ లలిత్‌ మంగళవారం పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. గురునానక్‌ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవుదినం. ఈ నేపథ్యంలో జస్టిస్‌ లలిత్, కాబోయే సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్‌ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం సోమవారం జరిపే లాంఛన విచారణను తమ వెబ్‌సైట్లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయాలని కోర్టు నిర్ణయించింది.

రిటైరయ్యే సీజేఐ చివరి విచారణను తన వారసునితో కలిసి చేపట్టడం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించనుంది. ఆగస్టు 26న సీజేఐగా రిటైరైన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చివరి రోజు చేపట్టిన విచారణను తొలిసారిగా కోర్టు లైవ్‌ స్ట్రీమ్‌ చేసింది.

ఇదీ చదవండి: హైకోర్టులు అలాంటి ఆదేశాలివ్వొద్దు!

>
మరిన్ని వార్తలు