రోగనిరోధకతను తప్పించుకునే శక్తి ఒమిక్రాన్‌కి అధికం

30 Dec, 2021 04:25 IST|Sakshi

హెచ్చరించిన ఇన్సకాగ్‌

న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తూ కల్లోలం రేకెత్తిస్తోంది. దీని ప్రభావాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన గణాంకాల లభ్యత ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉంది. కానీ తాజాగా లభించిన  క్లీనికల్, పరిశోధన వివరాలను పరిశీలించిన సైంటిస్టులు, మానవ శరీరంలో ఇమ్యూనిటీ(రోగనిరోధకత)ను తప్పించుకుపోయే శక్తి సామరాŠధ్య్‌లు ఒమిక్రాన్‌కు అధికంగా ఉన్నాయని వెల్లడించారు.

అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం దీని వల్ల కలిగే అనారోగ్య తీవ్రత గత వేరియంట్లతో పోలిస్తే తక్కువగానే ఉందని తెలిపారు. అంతర్జాతీయ డేటా ఆధారంగా ఇన్సకాగ్‌(ఐఎన్‌ఎస్‌ఏసీఓజీ– ఇండియన్‌ సార్స్‌ కోవిడ్‌2 జీనోమిక్స్‌ కన్సార్షియా) ఈ అంచనాలను తన తాజా బులిటెన్‌లో ప్రకటించింది. భారత్‌లో ఒమిక్రాన్‌ వ్యాప్తి, తీవ్రత పర్యవేక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. ఇప్పటికీ ప్రపంచంలో డెల్టానే ఆధిపత్య వీఓసీ (వేరియంట్‌ ఆఫ్‌ కన్సెర్న్‌)అని, కానీ దక్షిణాఫ్రికాలో మాత్రం డెల్టా స్థానాన్ని ఒమిక్రాన్‌ ఆక్రమించిందని వెల్లడించింది. యూకే తదితర ప్రాంతాల్లో ఆధిపత్య వీఓసీ దిశగా ఒమిక్రాన్‌ దూసుకుపోతున్నట్లు తెలిపింది.  

టీకా సామర్థ్యాన్ని తగ్గిస్తోంది
అంతర్జాతీయంగా లభిస్తున్న సమాచారాన్ని విశ్లేషిస్తే ఒమిక్రాన్‌ వేరియంట్‌ కోవిడ్‌ టీకాల సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్లు తెలుస్తోందని ఇన్సకాగ్‌ నివేదిక తెలిపింది. కేవలం టీకాల సామరŠాధ్యన్నే కాకుండా గతంలో ఇన్‌ఫెక్షన్‌ ఒకమారు సోకడం వల్ల కలిగే రోగనిరోధకత కూడా ఒమిక్రాన్‌ సోకకుండా కాపాడలేకపోతోందని అభిప్రాయపడింది. డెల్టాతో పోలిస్తే అధిక మ్యుటేషన్లు పొందిన కారణంగా దీనికి ఇమ్యూనిటీ నుంచి తప్పించుకునే శక్తి పెరిగినట్లు వివరించింది. లక్షణాల్లో తీవ్రత కనిపించకున్నా, ప్రస్తుతానికి దీని వల్ల కలిగే ప్రమాదం అధికమనే భావించాలని సూచించింది. దేశవ్యాప్తంగా జీనోమ్‌ సీక్వెన్స్‌ శాంపిళ్లను, జిల్లాలవారీ గణాంకాలను ఇన్సకాగ్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితిని విశ్లేషిస్తోంది. 
900 దాటిన ఒమిక్రాన్‌ కేసులు
భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు 900 దాటిపోయాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 85 ఒమిక్రాన్‌ కేసులు రాగా... ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు కూడా ఒమిక్రాన్‌ కేసులు అధికంగా వచ్చాయి. పంజాబ్‌లో తొలి ఒమిక్రాన్‌ కేసు వచ్చింది. దేశంలో 9,125 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మణిపూర్‌లో నైట్‌ కర్ఫ్యూ విధించారు.

మరిన్ని వార్తలు