ఢిల్లీకి వ్యాక్సిన్‌ సరఫరాకు స్పుత్నిక్‌-వి అంగీకారం: కేజ్రీవాల్‌

26 May, 2021 17:40 IST|Sakshi

ఢిల్లీ: రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు  ఢిల్లీ ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను ఢిల్లీకి సరఫరా చేసేందుకు తయారీదారులు అంగీకరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం తెలిపారు. అయితే ఎంత మొత్తంలో రాష్ట్రానికి వ్యాక్సిన్‌ సరఫరా చేస్తారనేదానిపై క్లారిటీ లేదని ఆయన తెలిపారు.

కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. '' స్పుత్నిక్‌-వి తయారీదారులతో ఇప్పటికే చర్చలు జరిపాం. వారు వ్యాక్సిన్‌ సరఫరా చేసేందుకు అంగీకరించారు. అయితే ఎంత మొత్తం ఇస్తారనేదానిపై స్పష్టత రాలేదు. మంగళవారం కూడా మరోసారి తయారీదారులతో మా అధికారులు చర్చలు జరిపారు. అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి వ్యాక్సిన్‌ కొనుగోలు చుసి తమ రాష్ట్ర ప్రజలకు అందించవచ్చిన కేంద్రం తెలిపింది.  వ్యాక్సిన్‌ సరఫరాపై అనేక రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించినా ఒక్క తయారీ సంస్థ కూడా ముందుకు రావడం లేదు. కానీ ఈ విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. ఇప్పటివరకు ఒక్క రాష్ట్రానికి కూడా వ్యాక్సిన్‌ డోస్‌ను అందించలేదు. ప్రస్తుతం వ్యాక్సిన్‌ అవసరాన్ని కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఇక లాక్‌డౌన్‌ను నిరవధికంగా కొనసాగించే ఆలోచన లేదు. అలా చేయడం వల్ల ఆర్ధిక, వ్యాపార కార్యకలపాలు దెబ్బతింటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెలాఖరున లాక్‌డౌన్‌పై ఒక నిర్ణయం తీసుకుంటాం.'' అని తెలిపారు

ఇక దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్‌ సత్ఫలితాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగో రోజు రెండువేల కన్నా తక్కువ కేసులే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1491 మంది కరోనా బారీన పడగా.. 130 మంది కరోనాతో మృతి చెందారు. కాగా కరోనా పాజిటివిటీ రేటు రెండు నెలల కనిష్టానికి పడిపోయి 1.93 శాతంగా నమోదైంది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. మే 23న 200లకు పైగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మే 24, 25న 100 కంటే తక్కువ కేసులు నమోదవగా.. తాజాగా బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడిన వారి సంఖ్య  600కు చేరినట్లు సమాచారం.
చదవండి: ఢిల్లీలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల కలకలం

మరిన్ని వార్తలు