భారత కరెన్సీపై కేజ్రీవాల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. మోదీకి లేఖ రాస్తూ.. 

28 Oct, 2022 16:07 IST|Sakshi

ఎన్నికల వేళ పొలిటికల్‌ లీడర్ల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేజ్రీవాల్‌.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ.. కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, గణేషుడి రూపాలను ముద్రించాలని కోరారు. 

అయితే, భారత ఆర్థిక వ్యవస్థపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా ప్రధాని మోదీకి రాసిన లేఖ విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో భారత ఆర్ధిక వ్యవస్ధ గడ్డుకాలం ఎదుర్కొంటోందని లేఖలో కేజ్రీవాల్‌ ప్రస్తావించారు. ఈ పరిస్ధితుల్లో ఓవైపు దేశ ప్రజలు కష్టపడి పనిచేయాలని, మరోవైపు దేవతల ఆశీస్సులు మెండుగా ఉంటేనే మనం సత్ఫలితాలు సాధిస్తామని ఆయన రాసుకొచ్చారు. దేశ ఆర్ధికాభివృద్ధి కోసం కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, గణేషుడి రూపాలు ముద్రించాలని కోరారు. 

మరోవైపు.. తాను కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, గణేషుడి రూపాలను ముద్రించాలని కోరిన అంశంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని 130 కోట్ల మంది తరపున ప్రధానికి విజ్ఞప్తి చేశానని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఇక కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇది కేవలం.. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల నేపధ్యంలో హిందూ వ్యతిరేక ముద్రను తొలగించుకునేందుకు ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. 

మరిన్ని వార్తలు