అబ్‌ క్యా కరే!

22 Nov, 2021 06:16 IST|Sakshi
మోదీ, యోగి ఫోటో వైరల్‌

లక్నో: ఈ ఫోటో చూశారు కదా..! ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ భుజం మీద చేతులు వేసి మరీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదో అంశం మీద చాలా సీరియస్‌గా చర్చిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. దీనిని యోగి ఆదిత్యనాథ్‌ ఆదివారం తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేస్తూ హిందీలో చిన్న కవితనే రాసుకొచ్చారు. నవభారత నిర్మాణం కోసం తామిద్దరం మేధోమథనం చేస్తున్నామన్న అర్థంలో ఆ కవిత సాగుతుంది. ‘‘ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మమ్మల్ని మేము అంకితం చేసుకుంటూ ప్రయాణాన్ని ప్రారంభించాం. ఆకాశ హద్దుల్ని చెరిపేస్తూ సూర్యకాంతుల్ని విరజిమ్మే నవభారత్‌ నిర్మాణం సాగిస్తామని ప్రతిజ్ఞ  చేశాం’’ అంటూ అని యోగి రాసుకొచ్చారు.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న నేపథ్యంలో మోదీ, యోగి మంతనాలు సాగిస్తున్న ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్నాళ్ల క్రితం యోగి పనితీరుపై ప్రధాని అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. యూపీ సీఎంను మారుస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు వీరిద్దరూ సన్నిహితంగా ఏదో చర్చించుకుంటున్న ఫోటోని చూసి బీజేపీ అభిమానులు పండగ చేసుకుంటూ ఉంటే, విపక్షాలు మాత్రం విరుచుకుపడుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఈ ఫోటోపై స్పందిస్తూ ‘‘రాజకీయాల్లో బయట ప్రపంచాన్ని మభ్యపెట్టడానికి ఒక్కోసారి  ఏదో ఒకటి చేస్తుంటారు. అయిష్టంగానే భుజం మీద చేతులు వేసి, కలిసి ఓ నాలుగు అడుగులు వెయ్యడం వంటివి అందులో భాగమే’’ అని ట్వీట్‌ చేశారు 

మరిన్ని వార్తలు