సుదర్శన్‌ టీవీకి షోకాజ్‌ నోటీసు

24 Sep, 2020 09:05 IST|Sakshi

ప్రోగ్రాం కోడ్‌ను ఉల్లంఘించినట్లు ఆధారాలున్నాయి

సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ

న్యూఢిల్లీ: కేబుల్‌ టీవీ చట్టంలోని ప్రోగ్రాం కోడ్‌ను ఉల్లంఘించిన సుదర్శన్‌ టీవీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సదరు టీవీలో ప్రసారమయ్యే ‘బిందాస్‌ బోల్‌’అనే కార్యక్రమంలోని కొన్ని అంశాలు కోడ్‌ ఉల్లంఘన కిందికి వస్తాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. షోకాజ్‌ నోటీసుపై ప్రభుత్వం తీసుకునే చర్యలు తమ ఉత్తర్వులకు లోబడి ఉండాలని కోర్టు పేర్కొంది. తమకు నోటీసు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ సుదర్శన్‌ టీవీ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు విచారణ చేపట్టింది. 

కేంద్రప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌(రెగ్యులేషన్‌) చట్టం-1995లో సెక్షన్‌ 20-సబ్‌ సెక్షన్‌ (3) కింద సుదర్శన్‌ టీవీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. దీనిపై టీవీ యాజమాన్యం 28వ తేదీలోగా స్పందించాలని, లేదంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ప్రభుత్వ యంత్రాంగంలోకి ముస్లింలు అక్రమంగా చొరబడుతున్నారంటూ సుదర్శన్‌ టీవీ ఇటీవల ప్రసారం చేసిన కార్యక్రమం తీవ్ర వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు