కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది?

26 Dec, 2022 14:30 IST|Sakshi

భోపాల్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు చెందిన అధికారిక భవనంలో కళాశాల విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కలకలం సృష్టించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఓంకార్‌ సింగ్‌ మార్కమ్‌కు చెందిన అధికారిక భవనంగా పోలీసులు తెలిపారు. శ్యామల హిల్స్‌ ప్రాంతంలో జరిగిన సంఘటనా స్థలం నుంచి సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

తీరథ్‌ సింగ్‌ అనే విద్యార్థి గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే భవనంలోనే ఉంటూ చదువుకుంటున్నట్లు గుర్తించారు పోలీసులు. క్యాన్సర్‌తో విద్యార్థి బాధపడుతున్నాడని, దాని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. సూసైడ్‌ నోట్‌ను చేతిరాత నిపుణుల వద్దకు పంపించి అది అతడిదేనా అనే కోణంలో విచారిస్తున్నారు. 

విద్యార్థి మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామని శ్యామల హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ఉమేశ్‌ యాదవ్‌ తెలిపారు. ‘ ప్రొఫెసర్‌ కాలనీలో ఉన్న దిడోద్రి ఎమ్మెల్యే ఓంకార్‌ సింగ్‌ మార్కమ్‌ అధికారిక నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. అక్కడ సూసైడ్‌ నోట్‌ సైతం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించాం.’ అని తెలిపారు. ప్రభుత్వ భవనంలో బాధితుడితో పాటు  ఉంటున్న మరో వ్యక్తితో మాట్లాడినట్లు చెప్పారు. అతడికి క్యాన్సర్‌ ఉందని భోపాల్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిసిందన్నారు. 

ఇదీ చదవండి: Hyderabad: గొంతులో కోడి గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి

మరిన్ని వార్తలు