వీళ్ల తెలివి తగలెయ్య! కళాశాల టాయిలెట్‌లో సీసీ కెమెరా.. ఆ తర్వాత

21 Mar, 2023 17:01 IST|Sakshi

ప్రపంచంలో రకరకాల దొంగలను మనం చూస్తూనే ఉంటాం. వీరిలో కొందరు విలువైన వస్తువులను దోచుకోగా, మరికొందరు తక్కువ విలువైన వస్తువులను దోచుకుంటుంటారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ దొంగ కళాశాలలోని కుళాయిలను తరచూ మాయం చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన కాలేజీ సెక్యూరిటీ టీమ్ దొంగలను పట్టుకునేందుకు తీసుకున్న చర్యల కారణంగా విద్యార్థులు నిరసనకు దిగారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే..

సీసీకెమెరా.. పొరపాటు జరిగింది.
అజంగఢ్‌లోని డీఏవీ పీజీ కళాశాల విద్యార్థులు 'తోటి చోర్' (నీటి కుళాయి దొంగ)ను పట్టుకునేందుకు ప్లాన్‌ చేశారు. అందుకోసం కళాశాలలోని పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టాయిలెట్‌ల వెలుపల కూడా ఒక కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో మండిపడ్డ విద్యార్థులు కళాశాల యాజమాన్యం తీరుపై మండిపడుతూ నిరసనకు దిగారు.

ఈ పరిణామాలపై యాజమాన్యం స్పందిస్తూ.. క్యాంపస్‌లో నిత్యం నీటి కుళాయిలు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నివారించేందుకు కుళాయిలపై నిఘా ఉంచాలనుకున్నాం. అందులో భాగంగానే సీసీటీవీ కెమరాలు ఏర్పాటు చేశాం. అయితే, పొరపాటున టాయిలెట్‌వైపు ఒక కెమెరా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాన్ని తీసివేసి మరో చోట మళ్లీ ఇన్‌స్టాల్ చేయమని ఆర్డర్ కూడా జారీ చేసినట్లు చెప్పింది.

కళాశాల ప్రిన్సిపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బాత్‌రూం దగ్గర సీసీటీవీ కెమెరా ఒకటి ఏర్పాటు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. మరో వైపు కళాశాల అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు వారి నిరసనను విరమించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు