మావోయిస్టుల అదుపులోని కమాండో రాకేశ్వర్ సురక్షితం

6 Apr, 2021 11:49 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ ఘటన‌లో కనిపించకుండా పోయిన కోబ్రా బెటాలియన్‌ కమాండో రాకేశ్వర్‌సింగ్‌ మావోయిస్టుల అదుపులో సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. అయితే రాకేశ్వర్‌ విడుదలపై ఇప్పటి వరకు మావోయిస్టులు ఎలాంటి డిమాండ్‌లు పెట్టలేదు. మరోవైపు రాకేశ్వర్‌ను విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ‘అంకుల్‌.. ప్లీజ్‌.. మా నాన్నను విడిచిపెట్టండి’ అంటూ కమాండో రాకేశ్వర్‌సింగ్‌ కుమార్తె మావోయిస్టులను వేడుకున్న విషయం తెలిసిందే. తన తండ్రిని తల్చుకుని ఏడుస్తూ.. విడిచిపెట్టాలని అభ్యర్థించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మొత్తంగా జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ క్షేమంగా బయటపడాలని ఇటు కుటుంబ సభ్యులు, అటు పోలీసులు, అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.

జవాన్ల కోసం ముమ్మర గాలింపు
బీజాపూర్ జిల్లాలోని తెర్రాం ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై శనివారం మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. మావోల దాడితో అలర్ట్ అయిన జవాన్లు.. ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 22 మంది జవాన్లు మృతి చెందగా.. మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మరికొంతమంది జవాన్లు అదృశ్యమయ్యారనే వార్త కలకలం రేపుతోంది. అదృశ్యమైన జవాన్ల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యను తీవ్రతరం చేశాయి. అదనపు బలగాలను రంగంలోకి దింపారు. మావోయిస్టుల కోసం భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సుక్మా, దంతేవాడ, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల అడవులను క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నారు.

చదవండి: ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదు: అమిత్‌ షా
'ప్లీజ్‌ అంకుల్‌.. మా నాన్నను విడిచిపెట్టండి'

మరిన్ని వార్తలు