కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ ఉల్లంఘన.. సీఎం ఉద్దవ్‌ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు

23 Jun, 2022 08:58 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నడుమ.. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కొవిడ్‌-19 ప్రోటోకాల్స్‌ ఉల్లంఘించినందుకుగానూ బీజేపీ నేత ఆయనపై పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. 

భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శి తజిందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా.. ఈ మేరకు ముంబై మలబార్‌ హిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆన్‌లైన్‌ కంప్లయింట్‌ చేశాడు. ఉద్దవ్‌ థాక్రేకు కరోనా పాజిటివ్‌ సోకిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. 

బుధవారం నాటి రాజకీయపరిణామాల అనంతరం రాత్రి.. ఆయన సీఎం అధికారిక నివాసం ‘వర్ష’ ఖాళీ చేసి వెళ్లారు. ఆ సమయంలో ఆయనపై పూలు చల్లి.. కార్యకర్తలంతా ‘మీ వెంటే ఉంటాం.. ముందుకు వెళ్లండి’ అంటూ నినాదాలు చేస్తూ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. కొవిడ్‌ బారిన పడ్డ వ్యక్తి.. ఐసోలేషన్‌లో ఉండకపోవడం, భౌతిక దూరం తదితర కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ను ఉద్దవ్‌ థాక్రే ఉల్లంఘించారన్నది తజిందర్ పాల్‌సింగ్‌ ఆరోపణ.

ఇక కుటుంబంతో సహా ‘మాతోశ్రీ’కి చేరుకున్న తర్వాత కూడా.. ఆయన వందల మంది మద్దతుదారులతో భేటీ నిర్వహించినట్లు తజిందర్‌ పాల్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు