రాహుల్‌ గాంధీ అనర్హత వేటుకి నిరసనగా..సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్‌!

26 Mar, 2023 16:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహల్‌ గాంధీ అనర్హత వేటుకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. తొలుత మహాత్మా గాంధీ స్మారక చిహ్నం వద్ద నిరసన చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీకి అనుమతనిపోలీసులు నిరాకరించారు. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే నేతృత్వంలో నేతలంతా రాజ్‌ఘాట్‌ వెలుపల సంకల్ప సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు పి చిదంబరం, జైరాం రమేష్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, ప్రమోద్‌ తివారీ, అజయ్‌ మాకెన్‌, ముకుల్‌ వాస్నిక్‌, అధిర్‌ రంజన్‌ చౌదరి తదితరలు పాల్గొన్నారు. ఢిల్లీ పోలీసులు ఈ ప్రాంతంలో గట్టి నిఘా ఉంచారు. పరిసర ప్రాంతంలోని పెద్ద సముహాలను నిషేధించారు.

ఈ మేరకు ఈ దీక్షలో ప్రియాంక వాద్రా మాట్లాడుతూ..నా సోదరుడు రాహుల్‌ని అమరవీరుడి కూమారుడని, మీర్‌ జాఫర్‌ అని అన్నావు. రాహుల్‌కి తన తల్లి ఎవరో తెలియదంటూ తల్లిని అవమానించావు. ఒక ప్రధానిగా పార్లమెంటులో అందరి ముందు..ఈ కుటుంబం నెహ్రు పేరును ఎందుకు ఉపయోగించదంటూ నా కుటుంబాన్ని వెటకరించావు అని నాటి ఘటనను గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలతో మొత్తం కాశ్మీర్‌ పండిట్ల కుటుంబాన్ని అవమానించావని తెలియలేదా?. అయినా తండ్రి మరణం తర్వాత ఆచారం ప్రకారం ఆ పేరును ముందుకు తీసుకువెళ్లే కొడుకుని ఇలా వ్యగ్యంగా అవమానించి బాధపెట్టడం సబబేనా అంటూ ప్రియాంక బీజేపీపై విరుచుకుపడ్డారు.

అలాగే కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే రాహుల్‌వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూ.. "ఆయన ఓబీసీ కమ్యూనిటీని అవమానించారంటున్నారు కదా! అసలు నీరవ్‌ మోదీ,  మెహుల్‌ చోక్సీ లలిత్‌ మోదీ వీరంతా ఓబీసీనా? అని నిలదీశారు. వారంతా దేశం విడిచి పారిపోయిన వారు. వాస్తవానికి రాహుల్‌ నల్లధనంతో పారిపోయి, పరారీలో ఉన్న వ్యక్తుల అంశాన్ని మాత్రమే లేవనెత్తితే..దాన్ని కమ్యూనిటీకి ఆపాదించారంటూ మండిపడ్డారు.

అంతేగాదు రాహుల్‌కి బాసటగా నిలిచేందుకు కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఇలాంటి నిరసనలు నిర్వహిస్తుంది. వాక్‌ స్వాతంత్ర్యం కోసం పోరాడుతాం. అలాగే మా నాయకుడి రాహుల్‌ గాంధీకి మద్దతుగా నిలిచినందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలకు ధన్యావాదాలు అని అన్నారు". కాగా, దాదాపు దశాబ్ద కాలంగా ప్రధాన ప్రతిపక్షానికి వాస్తవాధినేతగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీ చేస్తున్న దాడులను నిరశిస్తున్నందుకే.. ఈ అనర్హత వేటు పేరుతో రాహుల్‌ని మౌనంగా ఉంచేలా చేసేందుకు పన్నిన  కుట్రగా కాంగ్రెస్ అభివర్ణించింది. 

(చదవండి: ఎంపీ పదవికి ఎసరు.. ట్విటర్‌ బయోను వినూత్నంగా మార్చిన రాహుల్‌.. గళమెత్తిన కాంగ్రెస్‌)

మరిన్ని వార్తలు