ఆడదానివై పోయావ్‌...ఎమ్మెల్యే వీరంగం

18 Jan, 2021 12:10 IST|Sakshi

కెమెరా సాక్షిగా  మహిళా అధికారికి కాంగ్రెస్‌  ఎమ్మెల్యే బెదిరింపులు

భోపాల్: కాంగ్రెస్‌కు చెందిన మధ్యప్రదేశ్ మాజీ మంత్రి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు దుమారం చల్లారకముందే ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఒక మహిళా అధికారిపై బెదిరింపులకు పాల్పడుతూ కెమెరా కంటికి చిక్కారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతోంది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న రైతు ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్‌ ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించింది.  ఈ సందర్భంగా మధ్యప్రదేశ్-రాజస్థాన్ సరిహద్దు సమీపంలోని సైలానా పట్టణంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది,

వివరాల్లోకి వెళ్లితే..కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్ష్ విజయ్ గెహ్లాట్  స్థానిక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం) కామిని ఠాకూర్‌పై విరుచుకుపడిన వైనం వివాదం రేపుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ తరువాత, ఎమ్మెల్యే నేతృత్వంలోని ఉద్యమకారులు మెమోరాండం సమర్పించడానికి ఎస్‌డీఎం కార్యాలయానికి చేరుకున్నారు. దీన్ని స్వీకరించేందుకు కామిని ఠాకూర్ ఎంతకీ బయటికి రాకపోవడంతో గెహ్లాట్ తీవ్ర అసహనానికి గురైనారు. ‘‘ఈ నియోజకవర్గం ప్రతినిధిని నేను.. నా మాటను మీరు అర్థం చేసుకోవడంలేదు.  మీరొక మహిళా అధికారి అయిపోయారు..  ఈ స్థానంలో మరో పురుష అధికారి వుంటే గల్లా పట్టుకొని మరీ... ఇచ్చేవాడిని అంటూ రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది.  దీనిపై  ఆగ్రహం​ వ్యక్తం మవుతోంది. 

మరిన్ని వార్తలు