అఫీషియల్‌: కాంగ్రెస్‌ అధ్యక్ష రేసు నుంచి గెహ్లాట్‌ అవుట్‌.. డిగ్గీ రాజా ఇన్‌

29 Sep, 2022 15:00 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ వీడింది. రేసులో ఎవరు తుది వరకు నిలుస్తారనే అనుమానాల నడుమ.. ద్విముఖ పోటీ ఖరారు అయ్యింది ఇవాళ. అశోక్‌ గెహ్లాట్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా.. దిగ్విజయ్‌ సింగ్‌ బరిలో నిలిచినట్లు ప్రకటించారు.

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్న్టట్లు అధికారికంగా ప్రకటించారు సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌. తొలుత పోటీ విషయంలో ఊగిసలాట ప్రదర్శించిన ఆయన.. ఇవాళ(గురువారం) నామినేషన్‌ ఫామ్‌లు తీసుకున్నారు. అనంతరం మీడియాకు ఆ విషయాన్ని తెలియజేశారు. అవును.. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. అందుకు సంబంధించిన నామినేషన్‌ పత్రాలివే అని ఆయన చూపించారు. అనంతరం ఆయన సోనియా గాంధీ నివాసానికి వెళ్లి.. కాసేపు చర్చించారు.

ఇక మరో సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ ఇదివరకే నామినేషన్‌ పత్రాలను తీసుకున్న విషయం తెలిసిందే. నామినేషన్లు వేసేందుకు చివరి రోజైన రేపు(సెప్టెంబర్‌ 30న).. ఈ ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు స్పష్టమవుతోంది. 

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, అశోక్‌ గెహ్లాట్‌.. పోటీ నుంచి తప్పుకున్నారు. సోనియా గాంధీతో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఆయన వివరాలను వెల్లడించారు. జరిగిన పరిణామాలపై అధిష్టానానికి క్షమాపణ చెప్పినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు.. అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌-దిగ్విజయ్‌సింగ్‌ మధ్యే పోటీ ఉంటుందని గెహ్లాట్‌ ప్రకటించారు. 

అశోక్‌ గెహ్లాట్‌.. అధిష్టానానికి ఇష్టుడిగా బరిలో దిగుతారని అంతా భావించారు. దీంతో ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక కావొచ్చనే చర్చ నడిచింది. అయితే ఒక్క వ్యక్తి.. ఒక్క పదవి కారణంతో ఆయన తనకు నచ్చిన వ్యక్తిని రాజస్థాన్‌ సీఎం చేయాలని భావించగా.. సచిన్‌ పైలట్‌ పేరు తెర మీదకు రావడంతో ఎమ్మెల్యేల తిరుగుబాటు అక్కడి రాజకీయం కలకలం రేపింది. ఈ క్రమంలో.. పరిణామాలపై వివరణ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వివరణ కోరగా.. ఇవాళ ఆయన ఆమె నివాసంలో భేటీ అయ్యారు.

>
మరిన్ని వార్తలు