రాహుల్‌ గాంధీ భద్రతపై ఆందోళన.. హోంశాఖకు కాంగ్రెస్‌ లేఖ

28 Dec, 2022 14:36 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా భారత్‌ జోడో యాత్ర పేరుతో రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది కాంగ్రెస్‌ పార్టీ. భారత్‌ జోడో యాత్రలో పలు సందర్భాల్లో భద్రతా ఉల్లంఘనలు జరిగాయాని, సరైన రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాసింది. జోడో యాత్ర శనివారం ఢిల్లీకి చేరుకోనుంది. అయితే, ఈ నేపథ్యంలో పలు సందర్భాల్లో యాత్ర భద్రత చర్యల్లో లోపాలు బయటపడ్డాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌.

రాహుల్‌ గాంధీకి ప్రస్తుతం జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉంది. అయితే భారత్‌ జోడో యాత్రలో జనాలను నియంత్రించడం, వారిని రాహుల్‌ గాంధీకి సమీపంలోకి రాకుండా చూడడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని లేఖలో పేర్కొంది కాంగ్రెస్‌. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, రాహుల్‌తో పాదయాత్ర చేస్తున్న వారు ఆయనకు భద్రత వలయంగా ఏర్పడి రక్షణ కల్పిస్తున్నారని తెలిపింది. ఢిల్లీ పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోతున్నారని వెల్లడించింది. హరియాణాలో కొందరు దుండగులు భారత్‌ జోడో యాత్ర కంటెయినర్లలోకి ప్రవేశించారని గురుగ్రామ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొంది. 

‘భారత్‌ జోడో యాత్ర అనేది దేశంలో శాంతి, సామర్యాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న పాదయాత్ర. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతీకార రాజీకీయాలకు పాల్పడకూడదు. కాంగ్రెస్‌ నేతల భద్రత, రక్షణకు భరోసా కల్పించాలి. జనవరి 3 నుంచి భద్రతా పరంగా సున్నితమైన పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌లోకి యాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్‌ నేతలకు సరైన భద్రత కల్పించాలని కోరుతున్నాం.’అని లేఖలో డిమాండ్‌ చేసింది కాంగ్రెస్‌.

ఇదీ చదవండి: అత్యంత అవినీతిమయం.. సోనియా కుటుంబంపై బీజేపీ తీవ్ర విమర్శలు

మరిన్ని వార్తలు