జైలు నుంచే అక్రమాలు.. 81 మంది అధికారులకు లక్షల్లో ముడుపులు

10 Jul, 2022 13:54 IST|Sakshi

ఢిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్‌ చంద్రశేఖర్‌ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అరెస్టై జైలుకు వెళ్లినా క్రమంలో.. అక్కడి నుంచే అన్ని కార్యక్రమాలు నడిపించాడు. అందుకోసం ఢిల్లీ రోహిణి జైలులోని 81మంది అధికారులకు సుకేష్‌ భారీగా లంచాలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత సుకేష్‌ను తిహార్‌ జైలుకు మార్చారు. ఇలా సుకేశ్‌ నుంచి లంచాలు పుచ్చుకున్న అధికారులు అతడికి సకల మర్యాదలు చేసినట్లు సమాచారం. జైలు బయట ఉన్న తన అనుచరులతో మాట్లాడేందుకు మొబైల్‌ ఫోన్‌ వంటివి అందించినట్లు దిల్లీ పోలీస్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) తేల్చింది. సుకేష్‌ నుంచి ముడుపులు అందుకున్న జైలు అధికారులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

తన భార్య లీనాతో ఉండేందుకు ఒక్క రాత్రికే జైలు అధికారులకు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు సుకేష్‌ ఇచ్చినట్లు ఈఓడబ్ల్యూ అధికారులు తెలిపారు. ఇటీవలే జైలు ఆసుపత్రికి వెళ్లిన సుకేశ్‌.. అక్కడి నర్సింగ్‌ స్టాఫ్‌ సాయంతో అనుచరులతో మాట్లాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ దిశగానూ ఆర్థిక నేరాల విభాగం విచారణ చేపట్టింది.

ఇదిలా ఉండగా.. తిహార్‌ జైలులో తమకు ప్రాణహాని ఉందని, దిల్లీ వెలుపలి జైలుకు తమని తరలించాలని గత నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు సుకేష్‌, ఆయన భార్య లీనా. జైలులో తమకు సాయం చేసినట్లు అనుమానిస్తున్న అధికారుల నుంచే తమకు ముప్పు ఉందని కోర్టుకు విన్నవించారు. దిల్లీ బయటి జైలుకు తమని మార్చాలని కోరారు. 2017లో ఎన్నికల సంఘం అధికారులకు లంచం కేసుకు సంబంధించిన మరో మనీలాండరింగ్‌ కేసులో గత ఏప్రిల్‌ 4న సుకేష్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. ‍అయితే.. ఇప్పటే ఆరోగ్య విభాగం ప్రమోటర్‌ శివిందర్‌ మోహన్‌ సింగ్‌ భార్య అదితి సింగ్ సహా పలువురు ప్రముఖ వ్యక్తులను మోసం చేసి కోట్ల రూపాయలు కాజేసిన నేరం కింద అరెస్టై జైలు జీవితం అనుభవిస్తున్నాడు సుకేష్‌. ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ సహా పలువురు మోడల్స్‌ను ఈడీ ప్రశ్నించింది.   


ఇదీ చదవండి: జాక్వెలిన్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇ‍వ్వడంలో సుకేశ్‌ భార్యదే కీలక పాత్ర

మరిన్ని వార్తలు