సచివాలయంలో విషాదం.. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన సీఎం స్టాలిన్‌

3 Nov, 2021 07:21 IST|Sakshi
నేలకొరిగిన చెట్టు, మృతురాలు కవిత 

నేలకొరిగిన చెట్టు 

మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి 

రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన ప్రభుత్వం

సాక్షి, చెన్నై: రాష్ట్ర సచివాలయం వద్ద మంగళవారం విషాదం చోటు చేసుకుంది. పెద్ద చెట్టు హఠాత్తుగా నేలకూలడంతో భద్రతా విధుల్లో ఉన్న మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ కవిత(40) సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. మరో కానిస్టేబుల్‌ తీ›వ్రంగా గాయపడ్డారు. జార్జ్‌ కోటలోని సచివాలయం నాలుగో గేట్‌ వద్ద సీఎం సెల్‌కు కూతవేటు దూరంలో ముత్యాల్‌పేట ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కవిత(40), రాయపేట స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మురుగన్‌(45) భద్రతా విధుల్లో ఉన్నారు. గాలి వీయడంతో హఠాత్తుగా అక్కడున్న పెద్ద చెట్టు వేళ్లతో సహా నేలకొరిగింది. ఈ ప్రమాదంలో కవిత మరణించారు. మురుగన్‌ తీవ్రంగా గాయపడ్డారు. చెట్టు కింద చిక్కుకున్న కవిత మృతదేహాన్ని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. గాయపడ్డ మురుగన్‌ను జీహెచ్‌కు తరలించారు.

             కవిత మృతదేహానికి నివాళులర్పిస్తున్న సీఎం స్టాలిన్‌  
 
సీఎం నివాళి 
ఈ ఘటనతో సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతికి గురయ్యారు. కవిత కుటుంబానికి సంతాపం తెలిపారు. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. మంత్రులు దురై మురుగన్, శేఖర్‌ బాబు, డీజీపీ శైలేంద్ర బాబు, చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివ్వాల్‌తో కలిసి రాజీవ్‌ గాంధీ జీహెచ్‌కు చేరుకుని కవిత మృతదేహానికి నివాళులర్పించారు. ఆమె భర్త పిల్లలను ఓదార్చారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశించారు. కాగా కవిత భర్త సాయిబాబా రైల్వే ఉద్యోగి. వీరికి కుమారులు అరుణ్‌కుమార్‌(22), విశాల్‌(15), కుమార్తె స్నేహప్రియ(20) ఉన్నారు. ఈ చెట్టు ఉదయం 9 గంటలకు నేలకొరిగింది. ఆ సమయంలో అధికారులు, సిబ్బంది సచివాలయానికి రాలేదు. అలాగే సీఎం సెల్‌కు విజ్ఞప్తిలు చేసుకునే వాళ్లూ రాలేదు. 10 గంటల అనంతరం చెట్టు నేలకొరిగి ఉంటే పెను ప్రాణనష్టం జరిగి ఉండేదని సచివాలయ సిబ్బంది పేర్కొన్నారు.  

చదవండి: (విషాదం: 4 రోజుల క్రితం పెళ్లిపీటలపై సందడి.. నేడు విగతజీవులుగా..)

మరిన్ని వార్తలు