సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొలీజియంతో సహా ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం, లోపరహితం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రస్తుత ఉన్న వ్యవస్థ నుంచే కనిపెట్టాలని తెలిపారు. రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు.
రాజ్యాంగాన్ని అమలుపర్చే న్యాయమూర్తులను విశ్వసనీయమైన సైనికులుగా అభివర్ణించారు. ప్రజాసేవ పట్ల అంకితభావం, అనురక్తి ఉన్నవాళ్లు న్యాయ వ్యవస్థలో చేరాలని సీజేఐ సూచించారు. న్యాయవాద వృత్తిలో వలస పాలన కాలం నాటి ఆచారాలను వదిలించుకోవాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు. లాయర్లకు కఠినంగా అమల్లో ఉన్న డ్రెస్ కోడ్ను పునఃపరిశీలించాలన్నారు. మన జీవన విధానం, మన వాతావరణానికి తగ్గట్టుగా డ్రెస్ కోడ్ ఉండాలని సూచించారు.