త్వరలో పార్లమెంటు కొత్త భవనం పనులు

24 Oct, 2020 05:27 IST|Sakshi

2022 నాటికి  పూర్తి

స్పీకర్‌ ఓం బిర్లా

సాక్షి, న్యూఢిల్లీ:  పార్లమెంటు నూతన భవన నిర్మాణం ఈ డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. అలాగే, 2022 అక్టోబర్‌ నాటికి నిర్మాణం పూర్తి అయ్యే అవకాశముంది. ఈ కాలంలో పార్లమెంటు సమావేశాలు ప్రస్తుత భవనంలోనే జరుగుతాయని లోక్‌సభ సెక్రటేరియట్‌ శుక్రవారం తెలిపింది. నిర్మాణ సమయంలో వాయు, శబ్ధ కాలుష్యాలను నియంత్రించేందుకు  చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. పార్లమెంటు  భవన నిర్మాణంలో నాణ్యత, సకాలంలో పూర్తి చేయడంపై రాజీ పడబోమని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా తెలిపారు.

భవన నిర్మాణ పనుల పర్యవేక్షణకు లోక్‌సభ సచివాలయ అధికారులు, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ, సీపీడబ్ల్యూడీ, ఎన్‌డీఎంసీ, అర్కిటెక్ట్‌లు సభ్యులుగా ఆయన ఒక కమిటీని నియమించారు. పార్లమెంటు  భవన నిర్మాణానికి సంబంధించి స్పీకర్‌ అధ్యక్షతన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి ఈ సమావేశానికి హాజరయ్యారు.  నూతన భవనంలో సభ్యులకు ప్రత్యేక కార్యాలయాలు ఉంటాయని తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభ చాంబర్ల పక్కనే విశాలమైన ’కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌’ ఉంటుందన్నారు. 

మరిన్ని వార్తలు