మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు

6 Feb, 2023 15:41 IST|Sakshi

న్యూఢిల్లీ: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియమిస్తూ కేంద్రం నోటిఫై చేయడంపై వివాదం చెలరేగింది. ఆమెను జడ్జిగా సిఫారసు చేసిన కొలీజియం నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విక్టోరియా గౌరి గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ముస్లింలు, క్రైస్తువులపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు.

దీంతో గౌరి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మొదట వచ్చేవారం విచారణ చేపడతామన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ఆ తర్వాత ఈ పిటిషన్‌పై ఈనెల 10న(శుక్రవారం)  విచారణ జరుపుతామని చెప్పారు.

విక్టోరియా గౌరికి హైకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించడాన్ని కొంతమంది మద్రాస్ హైకోర్టు లాయర్లు ఇప్పటికే వ్యతిరేకించారు. ఆమెను జడ్జిగా నియమించవద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు కొలీజియాన్ని కోరారు. ఈమె జడ్జి అయితే ముస్లింలు, క్రైస్తవులకు తమకు న్యాయం దక్కుతుంది అనే నమ్మకం ఉంటుందా? అని ప్రశ్నించారు.

న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియానికి కేంద్రానికి మధ్య మాటల యుద్ధం జరిగిన సమయంలో విక్టోరియా గౌరి పదోన్నతి సాఫీగా జరిగిపోయిందని పలువురు విమర్శలు గుప్పించారు.
చదవండి: ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు

మరిన్ని వార్తలు