ఢిల్లీ రోడ్లా..? మజాకా..!

20 Jul, 2021 12:11 IST|Sakshi

అది దేశ రాజధాని ఢిల్లీ. పైగా నిత్యం లక్షల వాహనాలు తిరిగే రద్దీ రోడ్లు. మరి అ‍క్కడి రోడ్డు ఎలా ఉండాలి? చాలా భద్రంగా, పటిష్టంగా ఉండాలి. కానీ ఓ చినుకు పడితేనే నీళ్లు నిలిచి పోయి, రోడ్లు కుంగిపోతే. రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌, దాని నాణ్యతను గాలికి వదిలేసిన ప్రభుత్వానిదే బాధ్యత. ఇది దేశ రాజధాని పరిస్థితి మాత్రమే కాదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితుల వల్ల వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. 

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో రోడ్లపై నీరు భారీగా చేరింది. అయితే నాణ్యత లేని రోడ్ల వలన వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ వాహనం సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ద్వారకాలోని అతుల్యా చౌక్ వద్ద రోడ్డులో కుంగిపోయింది. ఈ ఘటనలో ఎవకూ గాయపడలేదు. కాగా ప్రమాదం జరిగిన కొద్దిసేపటి  హైడ్రో క్రేన్ సహాయంతో కారును బయటకు తీసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.

అంతేకాకుండా వజీరాబాద్ ప్రాంతంలో వ్యాన్‌పై ట్రక్కు బోల్తా పడిపోవడంతో ఆరుగురు గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. అయితే ‘‘ఢిల్లీ రోడ్ల పనితనం అంటే.. మజాకా!’’ అంటూ ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక గడిచిన 24 గంటల్లో దేశ రాజధానిలో 70 మి.మీ. వర్ష పాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. 15 మిమీ కంటే తక్కువ వర్షపాతం తేలికపాటి వర్షంగా, 15-64.5 మిమీ ఓ మోస్తరుగా, 65.5-115.5 మిమీ ‘హెవీ’గా, 115.6-204.4 మిమీ భారీ వర్షపాతంగా, 204.4 మిమీ పైన అతిభారీ వర్షపాతంగా పరిగణిస్తారు.

మరిన్ని వార్తలు