అనుచిత ప్రవర్తన.. పోలీస్‌ సస్పెన్షన్‌

19 Sep, 2020 11:11 IST|Sakshi

లక్నో: పొట్టకూటి కోసం రిక్షా నడుపుకుంటున్న ఓ వికలాంగుడితో అనుచితంగా ప్రవర్తించిన ఓ పోలీస్‌ సస్పెన్షన్‌కు‌ గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే.. రాష్ట్ర రాజధాని లక్నోకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనౌజ్‌లోని పోలీస్ స్టేషన్ వద్ద ఓ కానిస్టేబుల్ ఏ మాత్రం మానవత్వం లేకుండా వికలాంగుడిని చెంపదెబ్బ కొట్టి నేలమీదకు తోసేశాడు. ఇదంతా జరుగుతున్నా చుట్టూ ఉన్న పోలీసులు కూడా స్పందించలేదు.

కాగా.. రోడ్డు పక్కనే ఉన్న ప్రయాణికులను ఎక్కించుకుంటుండగా కానిస్టేబుల్‌ తనపై దాడికి పాల్పడ్డాడని బాధితుడు చెప్తుండగా.. సదురు వ్యక్తి తప్పుగా ప్రవర్తించాడని కానిస్టేబుల్‌ ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై కనౌజ్‌ జిల్లా పోలీస్‌ సూపరిండెంట్‌ను అమరేంద్ర ప్రతాప్‌ సింగ్‌ను వివరణ కోరగా.. కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించి, ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కొన్ని సందర్భాలలో పోలీసు అధికారులు 'తమను తాము నియంత్రించుకోవాలే కానీ.. ప్రజలతో తప్పుగా ప్రవర్తించరాదు' అని సింగ్ అన్నారు. (గత 24 గంటల్లో 93,337 కరోనా కేసులు)

>
మరిన్ని వార్తలు