సహోద్యోగులపై పోలీస్‌ కాల్పులు.. ముగ్గురు మృతి

18 Jul, 2022 18:11 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ పోలీస్‌ తన వద్ద ఉన్న తుపాకీతో ముగ్గురు సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు పోలీసులూ మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  రోహిణి ప్రాంతంలోని హైదర్‌పూర్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో సిక్కిం రాష్ట్రానికి చెందిన పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరి మధ్య జరిగిన  గొడవ కారణంగా ఓ సిక్కిం పోలీస్‌(32) తోటి సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సంఘటన స్థలంలోనే మరణించారు.

మృతులను కమాండర్‌ పింటో నామ్‌గ్యాల్‌ భూటియా, ఇంద్ర లాల్‌ చెత్రీగా పోలీసులు గుర్తించారు. మరొకరు దన్‌హంగ్‌ సుబ్బాకు తీవ్ర గాయాలవ్వగా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ అతను కూడా మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన నిందితుడిని ప్రబిన్‌ రాయ్‌గా గుర్తించిన ఢిల్లీ పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

కాగా రాయ్‌ ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్స్‌, సిక్కిం పోలీసులకు చెందిన వాడు. రాయ్‌, భూటియా 2012 బ్యాచ్‌ నుంచి గ్రాడ్యూయెట్‌ పూర్తి చేయగా‌.. సుబ్బా, చెత్రీ 2013 బ్యాచ్‌కు చెందిన వారు.

మరిన్ని వార్తలు