కరోనా నుంచి కోలుకున్న బీఎస్‌ యెడియూరప్ప

10 Aug, 2020 19:49 IST|Sakshi

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం మధ్యాహ్నం మణిపాల్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన ద్వారా వెలువరించింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే సీఎం యెడియూరప్ప తను కోలుకోవాలని కోరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్వీట్‌ చేశారు. ‘నా కోసం ప్రార్థించిన మీ అందరికి ధన్యవాదాలు. నేను ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాను. అలాగే ప్రస్తుతం ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటాను. మీ అందరి అప్యాయతలకు కృతజ్ఞుడిని. త్వరలోనే తిరిగి విధులు నిర్వహించాలని ఎదురు చూస్తున్నాను.’  అని పేర్కొన్నారు. (సీఎం కుమార్తెకు కరోనా పాజిటివ్‌)

కాగా యెడియరప్పకు ఆగస్టు 2 న కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వెంటనే బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో ఆసుపత్రిలో చేరారు. ఆ మరుసటి రోజే ఆయన కుమార్తె పద్మావతికి కూడా కరోనా పాజిటివ్‌ తేలడంతో ఆమె కూడా అదే ఆస్పత్రిలో చేరారు. అయితే యెడియూరప్ప అనంతరం రాష్ట్రంలోని అనేకమంది రాజకీయ నాయకులు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. ఆగష్టు 4న మాజీ సీఎం సిద్ధ రామయ్యకు కరోనా సోకగా నిన్న( ఆగష్టు9) రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు సైతం కరోనా బారిన పడ్డారు. ఇక కర్ణాటకలో ఆదివారం కొత్తగా 5,985 ​కేసులు వెలుగు చూడగా, మొత్తం కేసుల సంఖ్య 1.78 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 3,198గా ఉంది. (కరోనా నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం)

>
మరిన్ని వార్తలు