గెలుపు సంబరం.. పొంచి ఉన్న కరోనా విస్ఫోటనం

2 May, 2021 17:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, అన్నాడీఎంకే, యూడీఎఫ్‌ కూటమితో పాటు బీజేపీ నాయకులు గెలుపు సంబరాలు చేసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించడంతో ఆయా పార్టీల శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల మాటున కరోనా ఉందనే విషయాన్ని విస్మరించారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి, తెలుగు రాష్ట్రాల్లో నాగార్జునసాగర్‌, తిరుపతి ఉప ఎన్నికతో పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్లో గెలుపొందిన పార్టీలకు చెందిన శ్రేణులు విజయోత్సవాలు చేసుకున్నారు. 

ఫలితాల అనంతరం గెలుపు సంబరాలు చేసుకోవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో విజయోత్సవాలపై ఈసీ నిషేధం విధించింది. అయితే గెలుపు ఆనందంలో పార్టీ శ్రేణులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆనందం వస్తే ఆపుకోలేమంటూ గుంపుగా తీన్మార్‌ డ్యాన్స్‌లు చేస్తూ.. రంగులు చల్లుకుంటూ బ్యాండ్‌భాజా మధ్య సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు గుమికూడి కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. ఆధిక్యం భారీగా ఉండడంతో ఉదయం నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. పార్టీ కార్యాలయాల ఎదుట, ప్రధాన చౌరస్తాల్లో పటాసులు పేలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ.. డ్యాన్స్‌లు చేస్తూ.. నినాదాలు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య గడిపారు.

అయితే ఈ సమయంలో మాస్క్‌లు ధరించడం.. భౌతిక దూరం పాటించడం.. శానిటైజర్‌ వినియోగం వంటివి మరిచారు. ఆనందోత్సాహాల మధ్య నిబంధనలు ఉల్లంఘించారు. దీన్ని గమనించిన ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వారిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. మరి చూడాలి ఈ సంబరాలపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది.  అయితే ప్రస్తుతం వీరు చేసిన చర్యలతో కొన్ని రోజుల్లో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. కరోనా విస్ఫోటనం చెందే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సంఘం చేసిన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ సంబరాలకు దూరంగా ఉన్నారు. 'ఇది ప్రజల విజయం. సంబరాలు చేసుకునే సమయం కాదు. అందరూ మాస్క్‌లు ధరించండి' అంటూ రెండు ముక్కలు చెప్పి మమతా వెళ్లిపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ఉప ఎన్నికలో విజయంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా సంబరాలకు దూరంగా ఉంది.

చదవండి: బీజేపీ కథేంటో మూడు ముక్కల్లో చెప్పిన శేఖర్‌ గుప్తా‌
చదవండి: ఈ విజయం కేసీఆర్‌కు అంకితం..నోముల భగత్‌

మరిన్ని వార్తలు