కరోనా: పార్లమెంట్‌ సమావేశాలు కుదింపు!

19 Sep, 2020 13:50 IST|Sakshi

వారం ముందే సమావేశాలు ముగించే అవకాశం

30 మంది ఎంపీలకు కరోనా

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం పార్లమెంట్‌ సమావేశాలపై తీవ్రంగా పడింది. వర్షాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌కు హాజరైనా ఎంపీలు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటి వరకు 30 మందికి పైగా ఎంపీలు, లువురు కేంద్ర మంత్రులకు వైరస్‌ సోకినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా సభను నడపడం కూడా సభాధిపతులకు ఓ సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాలను కుదించే యోచనలో కేంద్రం ఉన్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలను ప్రారంభించినా.. కేసులు పెరగడంతో కేంద్రం పునరాలోచనలో పడింది. (రసవత్తరంగా రాజ్యసభ.. గట్టెక్కేదెలా!)

కరోనా బారినపడ్డ ఎంపీల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఈనెల 24 కల్లా సమావేశాలను ముగించాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రోజులు గడుస్తున్నా కొద్దీ ఎక్కువ మంది సభ్యులు వైరస్‌ మారినపడుతుండటంతో పలువురు ఎంపీలు సమావేశాలను కుదిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కీలక బిల్లులకు ఆమోదం తర్వాత పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలమైన వ్యవసాయ బిల్లులకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలపగా.. ఆదివారం నాడు రాజ్యసభ ముందుకు రానున్నాయి. కాగా సెప్టెంబర్ 14న మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1 వరకు జరుగనున్నాయి. (సెలవులు కోరుతున్న రాజ్యసభ ఎంపీలు)

మరిన్ని వార్తలు