అహ్మదాబాద్: అందరిని రక్షించే వారియర్ తన కుటుంబాన్ని మాత్రం కరోనా నుంచి కాపాడుకోలేకపోయారు. ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న కరోనా తాజాగా ఓ పోలీసు కుటుంబంలో ముగ్గురుని మింగేసింది. ఈ విషాద ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కానిస్టేబుల్ ధావల్ రావల్ తల్లిదండ్రులతో పాటు సోదరుడికి కూడా కరోనా సోకింది. దీంతో వారు అహ్మదాబాద్లో తక్కరానగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రోజులు గడిచే క్రమంలో తల్లిదండ్రుల పరిస్థితి క్షీణించడంతో ధావల్ వారిని సివిల్ ఆస్పత్రికి మార్చారు. చదవండి: (కరోనా విజృంభణ: సుప్రీం కీలక ఆదేశాలు)
సోదరుడిని మరో ప్రైవేట్ ఆప్పత్రిలో చేర్చారు. అయితే, ధావల్ తల్లి నవంబర్ 14న కన్నుమూశారు. అనంతరం రెండు రోజుల వ్యవధిలోనే తండ్రి కూడా కరోనా కాటుకి బలయ్యాడు. వీరి మరణాలు మరవకముందే సోదరుడు కూడా మరణించాడు. ఈ ముగ్గురు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే మరణించడంతో ఆ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అహ్మదాబాద్ నగరంలో కరోనా వైరస్ కేసులు గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. కేవలం ఆదివారమే 341 కొత్త పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 47,309కు చేరుకుంది. ఎనిమిది మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 1,968 కు పెరిగాయి.