తమిళనాడు: ఆక్సిజన్‌ అందక 11 మంది మృతి

5 May, 2021 07:58 IST|Sakshi

సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరిన కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో బెడ్‌లు, ఆక్సిజన్‌ దొరక్క కరోనా బాధితులు మృతి చెందుతున్నారు. తాజాగా తమిళనాడులోని చెంగల్పట్టు ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది కరోనా బాధితులు మృతి చెందారు. ఇప్పటికీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఆక్సిజన్‌ ట్యాంక్‌ పూర్తిగా ఖాళీ కావటంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

ఆక్సిజన్‌ సరఫరా లేకపోవటంతో మరికొంత మంది కరోనా పేషెంట్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆక్సిజన్‌ తెప్పించేందుకు ఆస్పత్రి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదు గంటల ముందే ఆక్సిజన్‌ లేదని చెప్పినా వైద్యులు పట్టించుకోలేదని కరోనా బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 24 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
చదవండి: Covid Cases in India: 2 కోట్లు దాటిన కరోనా కేసులు

మరిన్ని వార్తలు