India Covid Update: వామ్మో కరోనా.. వేవ్‌ ఊసులేకుండానే వణికిస్తోంది! రాష్ట్రాలకు కేంద్రం లేఖ

6 Aug, 2022 14:55 IST|Sakshi

ఢిల్లీ: క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుందనుకున్న కరోనా.. తాజా కేసులు పెరిగిపోతుండడం కలవరపరుస్తోంది. నిత్యం 19వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదు అవుతున్నాయి ఈ మధ్య. మరో వేవ్‌ ముప్పు తప్పినట్లేనని, వైరస్‌ ప్రభావం తగ్గిందని, వ్యాక్సినేషన్‌ ప్రభావంతో కరోనా కట్టడి జరుగుతుందని వైద్య నిపుణులు భావించారు ఇంతకాలం. అయితే కొత్త వేరియెంట్‌ ప్రస్తావన లేకుండా కొత్త కేసులు పెరిగిపోతుండడం కలవరపరుస్తోంది. 

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాసింది. కరోనా కేసులు పెరిగిపోతున్నందున కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలను కోరింది. అంతేకాదు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్రేసింగ్‌పై దృష్టి సారించాలని సూచించింది. ముఖ్యమంగా ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమం తప్పకుండా పెరుగుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శిలకు లేఖలు రాసింది. 

అంతేకాదు.. దేశంలో కొవిడ్‌-19 జబ్బుతో మరణించేవాళ్ల సంఖ్య సైతం యాభైకి తక్కువ కాకుండా నమోదు అవుతోంది. కాబట్టి, కరోనా ప్రొటోకాల్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య కార్యదర్శి లేఖలో కోరారు. 

తాజాగా గడిచిన 24 గంటల్లో.. 19,406 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో దేశవ్యాప్తంగా 49 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు దేశంలో నమోదు అయిన మరణాల సంఖ్య 5,26,649కి చేరింది. పాజిటివిటీ రేటు సైతం ఆందోళనకరంగానే ఉంది. అయితే  అదే సమయంలో.. గత 24 గంటల్లో రికవరీల సంఖ్య 19,928కి పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,35 వేల నుంచి లక్షా 34 వేలకు తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

ఇదీ చదవండి: నా కూతుళ్లకే వ్యాక్సిన్‌ వేస్తారా! 

మరిన్ని వార్తలు