కరోనా: ఒక్కరోజులోనే 66 వేల కేసులు!

13 Aug, 2020 10:15 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విలయ తాండవం కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల తీవ్రత యధాతథంగా పెరుగుతూ ఉంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 66,999 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,96,638కు చేరింది. బుధవారం రికార్డు స్థాయిలో 942 మంది కరోనాతో మృత్యువాతపడటంతో ఇప్పటి వరకు 47,033 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో భారత్‌ యూకేను దాటేసి నాలుగో స్థానానికి ఎగబాకింది. భారత్‌లో ప్రస్తుతం 6,53,622 యాక్టివ్‌ కేసులు ఉండగా, 16,95,982 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 70 శాతం ఉంది. (23 లక్షలు దాటిన కరోనా కేసులు)

బుధవారం 8,30,391 టెస్టులు చేయగా మొత్తం ఇప్పటి వరకు 2,68,45,688 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలో 5,48,313 కేసులు ఉండగా, 3,14,520 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 2,50,000 మందికి కరోనా సోకగా, కర్ణాటకలో ఈ సంఖ్య 1,82,354గా ఉంది. అలాగే 1,47,391 కేసులతో దేశ రాజధాని ఢిల్లీ అయిదో స్థానంలో ఉంది. (వరండాలోనే స్నానం.. మిద్దెపై నివాసం)

మరిన్ని వార్తలు