దారుణం: అంబులెన్స్ నుంచి ఎగిరిపడిన కరోనా మృతదేహం

24 Apr, 2021 14:02 IST|Sakshi

భోపాల్‌: కరోనా రెండో దశ సునామీలో ముంచుకొస్తుంది. నిత్యం మూడు లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నయి. అదే విధంగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఓవైపు కరోనా తీవ్ర రూపం దాల్చుతుండటంతో ప్రజలు ఉలిక్కిపడుతుంటే.. మరోవైపు కోవిడ్‌ బాధితుల మృతదేహాలను పూడ్చి పెట్టేందుకు సరైన స్థలం దొరక్కపోవడం మరింత ఆందోళనకరంగా మారింది. ప్రతి చోట  కరోనా మృతదేహాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. శవాలను మోసుకొచ్చి, శ్మశాన వాటికలు ఖాళీగా లేకపోవడంతో తమ వంతుకోసం అంబులెన్సులు వరసగా నిలుచుంటున్నాయి.

తాజాగా కోవిడ్ -19 బాధితుల మృతదేహాలను తరలించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపే ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. విదిషా జిల్లాలో ఓ ఆసుపత్రి నుంచి శ్మశాన వాటికకు తరలిస్తున్న అంబులెన్స్‌ నుంచి ఓ కరోనా మృతదేహం కిందపడిపోయింది. ఈ సంఘటన శుక్రవారం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో చోటుచేసుకుంది. డ్రైవర్ అధిక వేగంతో వాహనాన్ని మలుపు తిప్పడంతో మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్ గేట్ ఒకటి విరిగింది. దీంతో మృతదేహం ఎగిరి రోడ్డుపై పడింది. దీన్ని గమనించిన కోవిడ్ -19 రోగుల బంధువులు ఆసుపత్రి బయటకి వచ్చి హాస్పిటల్‌ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీనికి సంబధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది.

అంతేగాక ఆసుపత్రి యాజమాన్యం తమ కుంటుంబీకుల మృతదేహాలను సకాలంలో అప్పగించడం లేదని కొంతమది ఆరోపించారు. అంతేగాక అసలు మరణ వార్త గురించి కుటుంబ సభ్యులకు, బంధువులకు చెప్పడం లేదని విమర్శస్తున్నారు. ఇక ఇటీవల విధిశా జిల్లాలో కోవిడ్‌ మరణాలు అధికమయ్యాయి. ప్రతిరోజూ సుమారు 20 నుంచి 25 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో నమోదవుతున్న మరణాలను ప్రభుత్వం అధికారికంగా చెప్పడం లేదనే అనుమానాలూ ఉన్నాయి. 

చదవండి: కరోనా సోకినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? 
మాస్క్‌ పెట్టుకోలేదారా.. ఇన్‌స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు!

మరిన్ని వార్తలు