Covid: కరోనాతో జీవనంలో మార్పులతో పాటు.. కొత్త జబ్బులు..

14 Nov, 2021 07:42 IST|Sakshi

సాక్షి, బనశంకరి (కర్ణాటక): జీవితాన్ని కడగండ్లపాలు చేసే ఇతర జబ్బులకు కూడా కోవిడ్‌ రక్కసి కారణమవుతోంది. గత ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కేవలం 6 నెలల్లో రాష్ట్రంలో 59, 632 మంది డయాబెటిస్, రక్తపోటు (బీపీ) రోగాల బారినపడినట్లు జాతీయ డయాబెటిస్‌ నియంత్రణ కార్యక్రమంలో వెల్లడైంది. కొత్తగా షుగర్ జబ్బు కనబడిన రోగుల్లో 35 నుంచి 40 శాతం మంది కోవిడ్‌కు గురైనవారిగా తేలింది.

జీవనంలో మార్పులకు తోడు కోవిడ్‌ సోకడం వల్ల షుగర్, బీపీ ప్రమాదం పెరిగింది. తీవ్రమైన కోవిడ్‌ బారినపడినవారికి చికిత్సలో స్టెరాయిడ్స్‌ ఔషధాలను ఇస్తారు. దీంతో దేహంలో షుగర్ భారీగా పెరిగి మధుమేహానికి దారి తీస్తోందని నిపుణులు తెలిపారు.  

కొత్త ప్రమాదాలు..  
ఇప్పటికే కర్ణాటకలో లక్షలాది మంది మధుమేహ, బీపీ రోగులు ఉన్నారు. కొత్తగా వచ్చినవారు వీరికి అదనం. నగర ప్రదేశాలకు పరిమితం కాదని, పల్లెల్లోని వారు, అక్కడి నుంచి వలస వచ్చిన వారిలో కూడా బీపీ, షుగర్‌ కనిపించాయి. కోవిడ్‌ రోగుల్లో 30 నుంచి 40 శాతం మందిలో మధుమేహం, బీపీ కనపించినట్లు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు తెలిపారు. కోవిడ్‌ సోకినప్పటికీ తీవ్రం కాకుండా సత్వర చికిత్స తీసుకోవడం, ఆరోగ్యకర జీవన రీతులతో షుగర్, బీపీ రాకుండా చూసుకోవచ్చని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు