బ్రేకింగ్‌: కరోనాతో ప్రధాని మోదీ చిన్నమ్మ కన్నుమూత

27 Apr, 2021 21:31 IST|Sakshi

అహ్మదాబాద్‌: దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. ఈ కరోనా ధాటికి సామాన్యులతో పాటు ప్రముఖుల ఇళ్లల్లోనూ విషాదం నిండింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కుటుంబంలో కూడా విషాదం చోటుచేసుకుంది. కరోనాతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిన్నమ్మ నర్మదా బెన్‌ (80) కన్నుమూసింది. కరోనాతో చికిత్స పొందుతూ ఆమె అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతిచెందింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రధాని సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ తెలిపారు.

అహ్మదాబాద్‌లోని న్యూ రణిప్‌ ప్రాంతంలో తన పిల్లలతో కలిసి నర్మదాబెన్‌ నివసిస్తుండేది. ‘మా పిన్నిని పది రోజుల కిందట సివిల్‌ ఆస్పత్రిలో చేర్పించాం. చికిత్స పొందుతూ ఆమె ఈ రోజు మరణించింది’ అని ప్రహ్లాద్‌ మోదీ మీడియాకు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తండ్రి దామోదర్‌ దాస్‌ తమ్ముడు జగ్జీవన్‌దాస్‌. ఆయన భార్యే నర్మదాబెన్‌. చిన్నాన్న కొన్నేళ్ల కిందట కాలం చేయగా తాజాగా చిన్నమ్మ కన్నుమూసినట్లు మోదీ పెద్దన్నయ్య ప్రహ్లాద్‌ మోదీ తెలిపారు.

చదవండి: మే 2 తర్వాతనే కరోనాపై కేంద్రం కఠిన నిర్ణయం?

చదవండి: గుడ్‌న్యూస్‌.. 64 వేల బెడ్లతో రైల్వే శాఖ సిద్ధం

మరిన్ని వార్తలు