దేశంలో రికార్డు స్థాయిలో 96,551 కేసులు

11 Sep, 2020 09:42 IST|Sakshi

న్యూ ఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96, 551 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,62,415 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1209 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 76,271 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 35,42,664 కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,43,480 గా ఉంది.

మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 20.68 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 77.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.67 శాతానికి పడిపోయిందని తెలిపింది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,63,542 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా... ఇప్పటివరకు 5,40,97,975 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.

మరిన్ని వార్తలు