ఆ మూడు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా

23 Feb, 2021 18:58 IST|Sakshi

కరోనా కొత్త వేరియంట్‌ కేసులు

లాక్‌డౌన్‌ దిశగా మరికొన్ని రాష్ట్రాలు

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కొత్త రకం కరోనా వైరస్‌ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు వెలుగుచూడటం భయాందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణల్లో N440K, N484K వైరస్‌లు బయటపడటం కలకలం రేపుతోంది. కొత్త రకం స్ట్రెయిన్‌ వల్లే కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నట్టు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్‌, కేరళ, కర్ణాటకలో ఈ రకం వైరస్‌ ఎక్కువగా విస్తరిస్తోంది. దీంతో కొన్నాళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న ప్రభుత్వాలు మరోసారి ఆందోళన చెందుతున్నాయి. ఓవైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్న మరోసారి వైరస్‌ విజృంభించడం కలవరానికి గురిచేస్తోంది. కొత్తరకం కరోనాను కట్టిడి చేసేందుకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు.

అప్రమత్తమైన తెలంగాణ..
మహారాష్ట్రంలో అత్యధికంగా కొత్త కేసులు నిర్థారణ కావడంతో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. పూణె, అమరావతి, నాగపూర్, యావత్మల్‌ వంటి ప్రాంతాల్లో కఠిన చర్యలకు ఉపక్రమించారు. పలు ప్రాంతాల్లో పాఠశాలనను సైతం మూసివేశారు. కొత్త రకం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పంజాబ్‌ ప్రభుత్వం సైతం చర్యలు చేపట్టింది. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇక కర్ణాటక, మహారాష్ట్రంలో కరోనా విజృంభించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలతోగల సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. అక్కడి నుంచే వారికి ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.

సరిహద్దులు మూసివేసిన కర్ణాటక..
మరోవైపు కరోనా వైరస్‌ కేరళ, కర్ణాటక మధ్య వివాదాన్ని రాజేస్తోంది. కేరళలో కేసులు ఎక్కువగా నమోదవడంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మరింది. కేరళ-కర్ణాటక మధ్య సరిహద్దుల్ని మూసివేస్తూ యడియూరప్ప ఆదేశాలు జారీచేశారు. కేరళలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై కేరళ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యడియూరప్ప నిర్ణయాన్ని తప్పుపడుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులను వెంటనే తెరపాలని కోరారు.

మరోవైపు గత ఏడాది కోవిడ్‌ సృష్టించిన విలయం నుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరోసారి కరోనా విజృంభిస్తే పరిస్థితి ఏంటన్నది అంతుపట్టడంలేదు. ఈ నేపథ్యంలోనే కోవిడ్‌ను అరికట్టేందుకు మరోసారి లాక్‌డౌన్‌ మంత్రాన్నే పాటించాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీనిలో భాగంగానే పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.

కరోనా విజృంభణ.. మరోసారి లాక్‌డౌన్‌!

మరిన్ని వార్తలు