దేశంలో తగ్గుతున్న కరోనా ప్రభావం

10 Nov, 2020 17:59 IST|Sakshi

దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోంది. సోమవారం పాజిటివ్‌ కేసులు 40 వేల కంటే తక్కువ నమోదైనట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,91,730కి చేరాయి. గత 24 గంటల్లో (మంగళవారం) 38,073 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. సోమవారం నాడు కరోనా కారణంగా 448 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,27,059 కి చేరిన్నట్టు కరోనా హెల్త్‌బులిటెన్‌లో తెలిపారు. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి మొత్తం 79,59,406 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 92.64% గా నమోదైంది. మరణాల శాతం 1.48% గా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,05,265 గా ఉన్నట్టు తెలిపారు. 

రాష్ట్రల వారీగా మరణాల సంఖ్య 
ఇప్పటి వరకు దేశంలో 1,27,059 మంది కరోనాకు బలయ్యారు. ఇందులో మహారాష్ట్రలో 45,325, కర్ణాటకలో 11,362, తమిళనాడులో 11,362, పశ్చిమ బెంగాల్‌లో 7350, ఉత్తరప్రదేశ్‌లో 7231, ఢిల్లీలో 7060, ఆంధ్రప్రదేశ్‌లో 6802, పంజాబ్‌లో 4338, గుజరాత్‌లో 3765 మంది మరణించారు. సోమవారం కరోనా బారినపడి 448 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో మహారాష్ట్రకు 85 మంది, ఢిల్లీలో 71 మంది, బెంగాల్‌లో 56 మంది, 25 మంది ఉత్తర్‌ప్రదేశ్‌లో, 22 మంది కేరళలో, 20 మంది పంజాబ్‌లో మరణించారు. కరోనా బారిన పడి మరణించిన వారిలో అధిక శాతం మంది దీర్ఘకాలీక వ్యాధులతో బాధపడుతున్నవారేనని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ కూడా ఇదే అంశం స్పష్టం చేసినట్టు తెలిపారు. 

కేసుల సంఖ్య ఎప్పుడు..ఎలా..!
దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షల మార్క్‌ను ఆగష్టు 7న , 30 లక్షల మార్క్‌ను ఆగష్టు 23న, సెప్టెంబర్‌ 5న 40లక్షలు, సెప్టెంబర్‌ 16న 50 లక్షల మార్కను దాటి ప్రస్తుతం 85 లక్షల పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో 11,96,15,857 కరోనా టెస్టులు నిర్వహించినట్టు, నవంబర్‌ 9న 10,43,665 టెస్ట్‌లు నిర్వహించినట్టు ఐసిఎంఆర్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు