ఒక్క రోజులో 72వేలకుపై గా కొత్త కేసులు

1 Apr, 2021 10:14 IST|Sakshi

వేగంగా విస్తరిస్తున్న  కరోనా వైరస్‌

గడిచిన 24 గంటల్లో 72,330 కేసులు, 459 మరణాలు

సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవు తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించిన  గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 72,330 కొత్త  కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. 459 మరణాలు సంభవించాయి. 40,382 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. రెండో దశలో దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది ముఖ్యంగా మహారాష్ట్రలో తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. 

కరోనా కేసుల నమోదుకు సంబంధించి దాదాపు ఆరు నెలల్లో దేశంలో ఇదే అతిపెద్ద నమోదు అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 10 న దాదాపు 74,000 కేసులు నమోదయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో కోవిడ్‌-19వ్యాప్తికలవరం పుట్టిస్తోంది.  కేసుల నమోదులో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్ ఛత్తీస్‌గడ్‌ ముందు వరుసలో ఉన్నాయి.  

మొత్తం కేసుల సంఖ్య ఒక కోటి 22 లక్షల 21 వేల 665కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య  లక్షా  62 వేల 927 గా ఉంది. మొత్తం రికవరీలు 1,14,74,683 గాను, క్రియాశీల కేసులు 5,84,055గా నమోదయ్యాయి. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. నేటి (ఏప్రిల్‌ 1వ తేదీ) నుంచి 45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందించనున్నారు. ఇప్పటికి మొత్తం టీకా తీసుకున్నవారి సంఖ్య  6,51,17,896గా ఉంది. 

మరిన్ని వార్తలు