ఒక్కరోజే 68 వేల కేసులు, 983 మరణాలు

21 Aug, 2020 09:45 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల రోజురోజుకూ అధికమవుతోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 68,898 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 29,05,823 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 983 కోవిడ్‌ బాధితులు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 54,849 కు చేరింది. తాజాగా 62,282 కరోనా పేషంట్లు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 21,58,946 కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం బులెటిన్‌లో పేర్కొంది. 

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.3 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. భారత్‌లో పాజిటివిటీ రేటు 8.54 శాతంగా ఉందని వెల్లడించింది. తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో 61 శాతం, మొత్తం మరణాల్లో 75 శాతం ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని తెలిపింది. అవి.. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌. ఇక ప్రపంచ వ్యాప్తంగా కేసుల చూస్తే భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
(చదవండి: సోషల్‌ మీడియాలో కరోనా వైద్యం)

మరిన్ని వార్తలు