చెన్నై: కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత భారీ సడలింపులతో అమల్లో ఉన్న లాక్డౌన్ను ప్రభుత్వం మళ్లీ బిగించింది. కొన్ని రోజుల క్రితం సడలింపులను సవరించగా ప్రతి ఆది వారం పూర్తి లాక్డౌన్ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా సెకండ్ వేవ్లో తొలి పూర్తి లాక్డౌన్ ఈ నెల 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. 236 రోజుల తర్వాత మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ చట్రంలోకి ప్రజలు మళ్లీ వెళ్లిపోవాల్సి వస్తోంది.
ఆదివారాల్లో వర్తక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలు మూసివేస్తారు. వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా నిషేధం. ప్రజలు రోడ్లపైకొస్తే అరెస్టు చేసేలా ఆంక్షలు తీసుకొచ్చారు. ఆదివారాల్లో మెట్రో రైలును ప్రతిగంటకోసారి సేవలందించేలా సవరించారు. ప్రతి ఆదివారం పూర్తి లాక్డౌన్ వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడకుండా అమ్మ క్యాంటీన్లను యథావిధిగా నిర్వహిస్తున్నారు.
26 నుంచి అదనపు ఆంక్షలు:
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి కొత్తగా అమల్లోకి తెస్తున్న ఆంక్షలను ఒక ప్రకటన ద్వారా సమాచారశాఖ శనివారం విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్నవి, కొత్తగా తీసుకొచ్చిన ఆంక్షలను పాటించి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.
ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు లాక్డౌన్ పొడిగించింది. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా ప్రజలు కరోనా ఆంక్షలు పాటించని కారణంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. గత నెల 28వ తేదీన 13,070 మంది చికిత్సలో ఉండగా, ఈనెల 23వ తేదీ నాటికి ఈ సంఖ్య 95,048కి చేరుకుంది. అందుకే ఈనెల 26వ తేదీ నుంచి అదనపు ఆంక్షలను అమల్లోకి వస్తున్నాయి.