విజృంభిస్తున్న కరోనా.. భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు

9 Jan, 2022 05:43 IST|Sakshi

థర్డ్‌వేవ్‌ మొదలైనట్లే

అన్ని రాష్ట్రాలను వణికిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ 

ఒకేరోజు 1,41,986 కొత్త కేసులు

4.72 లక్షలకు చేరిన యాక్టివ్‌ కేసుల సంఖ్య

న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి.  వాయువేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్‌ వేరియెంట్‌ అన్ని రాష్ట్రాల్లోనూ వణుకు పుట్టిస్తోంది. గత కొద్ది రోజుల వరకు దేశంలో పశ్చిమాది రాష్ట్రాల్లో మాత్రమే ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చేవి. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో డెల్టా కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. కానీ ఇప్పుడు తూర్పు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్‌ విజృంభణ మొదలైందని  కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఒకే రోజులో  1,41,986 కరోనా  కేసులు నమోదయ్యాయి. 222 రోజుల తర్వాత లక్షన్నరకి చేరువలో కేసులు నమోదు కావడంతో ఒమిక్రాన్‌ ఎంత ప్రమాదకరంగా మారుతోందో అర్థమవుతోంది.  కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,72,169కి చేరుకుంది. కేవలం ఒకే రోజులో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,00,806 దాటేయడం డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. రోజువారీ కేసుల పాజిటివిటీ రేటు 9.28శాతం ఉంటే, వీక్లీ పాజిటివిటీ రేటు 5.66శాతంగా ఉంది 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ కేసులు 3,071కి చేరుకున్నాయి.  

ఆంక్షలు కఠినతరం చేయాలి: డబ్ల్యూహెచ్‌ఓ పిలుపు
ఆగ్నేయాసియా దేశాల్లో కోవిడ్‌–19 కేసులు భారీగా వెలుగులోకి వస్తూ ఉండడంతో కఠినమైన ఆంక్షలు విధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పిలుపునిచ్చింది. వైరస్‌ సామాజిక వ్యాప్తిని నివారించడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, ప్రజారోగ్య సదుపాయాలను పెంచాలని సూచించింది. ఒమిక్రాన్‌ వేరియెంట్‌ తక్కువ తీవ్రత ఉంటుందని భావించి నిర్లక్ష్యం చేయవద్దని డబ్ల్యూహెచ్‌ఒ ఆగ్నేయాసియ రీజనల్‌ డైరెక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ హితవు పలికారు.

మరిన్ని వార్తలు