కీచక కరస్పాండెంట్‌.. నాలుగు రోజులు పాఠశాలకు సెలవు

24 Nov, 2022 07:26 IST|Sakshi
ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ఇన్‌సెట్‌లో కరస్పాండెంట్‌ వినోద్‌  

విద్యార్థినులకు లైంగిక వేధింపులు 

తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగిన బాలికలు 

పరారీలో కరస్పాండెంట్‌ వినోద్‌ 

విచారణ చేపట్టిన డీఈఓ, ఉన్నతాధికారులు 

తిరునిండ్రవూర్‌ ప్రైవేట్‌ పాఠశాలలో ఉద్రిక్తత 

సాక్షి, చెన్నై(తిరువళ్లూరు): ప్లస్‌టూ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైగింక వేధింపులకు గురి చేయడంతో ఆగ్రహించిన బాలికలు తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఈ ఘటన తిరువళ్లూరు జిల్లాలో బుధవారం జరిగింది. వివరాలు.. తిరునిండ్రవూర్‌లోని ఏంజెల్‌ మెట్రిక్‌ ప్రైవేటు పాఠశాలలో సుమారు 2 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.

నర్సరీ నుంచి ప్లస్‌టూ వరకు పాఠశాల చైర్మన్‌ సిందై జయరామన్‌ ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు వినోద్‌(34) కరస్పాడెంట్‌గా ఉన్నారు. కొద్ది రోజులుగా వినోద్‌ ప్లస్‌టూ, ప్లస్‌వన్‌ విద్యార్థినులను కౌన్సిలింగ్‌ పేరిట ప్రత్యేక గదికి పిలిపించుకుని అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లౌగింక వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది. పాఠశాలలో పనిచేస్తున్న టీచర్‌లపై సైతం లౌగింకంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదే విషయంపై పలుమార్లు పాఠశాల చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు బుధవారం ఉదయం తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. వినోద్‌ను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. విషయం తెలుసుకున్న సీఈఓ రామన్, డీఈఓ రాధాకృష్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. జరిగిన విషయాలను విద్యార్థినులు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అతనిపై పోలీసులు నాలుగు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వినోద్‌ కోసం గాలిస్తున్నారు. 

నాలుగు రోజులు పాఠశాలకు సెలవు  
విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. విద్యార్థులు ఆందోళన చేయవద్దని..నిందితులపై చర్యలు తీసుకుంటామని.. విద్యార్థినుల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇస్తూ మేసేజ్‌లు పంపింది. 

బీజేపీ నాయకులకు చుక్కెదురు 
విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు వారికి మద్దతుగా నిరసనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళన రాజకీయ కోణంలో వెళుతున్నట్లు గుర్తించిన కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇది పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థులకు మధ్య సమస్య అని.. తామే పరిస్కరించుకుంటామని తెలిపారు. 

మరిన్ని వార్తలు