అందరికీ న్యాయం.. డబ్బే అడ్డంకి: కోవింద్‌

27 Nov, 2020 06:18 IST|Sakshi

న్యూఢిల్లీ: అందరికీ న్యాయాన్ని అందించడంలో ప్రధాన అడ్డంకి డబ్బేనని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. సుప్రీంకోర్టు నిర్వహించిన 71 వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో కూడా అందరికీ న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థ, బార్‌కౌన్సిల్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కృషి చేశాయన్నారు. ఉన్నత న్యాయస్థానం తమ తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తేవడం అభినందించదగిన విషయమని చెప్పారు.

ఉన్నత ప్రమాణాలూ, ఆదర్శాలూ, కీలక తీర్పులతో న్యాయవ్యవస్థ బలోపేతం అయ్యిందని, సుప్రీంకోర్టు ప్రతిష్ట పెరిగిందని అన్నారు. పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను సాధించడం గురించి రాజ్యాంగ పీఠికలో రాసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమణ్, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు దుష్యంత్‌ దావేలు కూడా ఉపన్యసించారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు