ఫలించని టీ దౌత్యం : నిరాహార దీక్ష

22 Sep, 2020 11:01 IST|Sakshi

రాత్రంతా నిద్రపట్టలేదు,   ఒక రోజు నిరాహార దీక్ష : హరివంశ్

సాక్షి,న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లుల ఆమోదంపై రాజ్యసభలో రగడ, ప్రతిపక్ష సభ్యుల నిరవధిక నిరసన కొనసాగుతుండగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంట్ ఆవరణలోని పచ్చిక బయళ్లలో రాత్రంతా నిరసన కొనసాగించిన ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మంగళవారం పరామర్శించారు. టీకప్పులతో దౌత్యం చేయడానికి ప్రయత్నించారు. అయితే రైతులకోసం ఉద్యమిస్తాం.. పార్లమెంటు హత్యకు గురైందనే ప్లకార్డులతో నిరసన కొనసాగిస్తున్న ఎంపీలు మాత్రం "టీ దౌత్యాన్ని" నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రైతు వ్యతిరేకి అంటూ ఆయనను దుయ్యబట్టారు. దీంతో తాను కూడా ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌ ప్రకటించడం విశేషం.  (ఎంపీల నిరసన : ఢిల్లీ పోలీసుల ఓవర్ యాక్షన్)

వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో విపక్ష ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని హరివంశ్‌ ఆరోపించారు. ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను ఇవాళ ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. సభలో పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయనీ, దీంతో రాత్రి నిద్ర కూడా పట్టలేదని పేర్కొన్నారు.  ప్రజాస్వామ్యం పేరిట గౌరవ సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. తన నిర్ణయం వారిలో “స్వీయ శుద్దీకరణ” భావనను ప్రేరేపిస్తుందని భావిస్తున్నానన్నారు. మరోవైపు తనపై దాడిచేసి, అవమానించిన వారికి వ్యక్తిగతంగా టీ ఆఫర్ చేయడం గొప్ప విషయమంటూ హరివంశ్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఆయన ఔదార్యం, శైలి ఆదర్శప్రాయం, ప్రజా స్వామ్యానికి  ఇది చక్కటి సందేశం అంటూ ట్వీట్ చేశారు.   

మరిన్ని వార్తలు