పెళ్లిలో భోజనం లేదు.. సరేలే అని కిచెన్‌లోకి వెళితే షాక్‌!

2 Jul, 2021 17:35 IST|Sakshi

అతిథిదేవో భవ అంటారు. సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులకు మర్యాదులు, భోజనాలు అంటూ వాళ్లకి సపర్యలు చేసి పది కాలాలు గుర్తుండిపోయేలా చేయాలనుకుంటారు. అయితే, ఈ పెళ్లి మాత్రం రోటీన్‌కు భిన్నంగా  జరిగింది. నవదంపతులను మనసారా ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులకు విందు పెట్టడమే కాదు, వారు తిన్న పాత్రలను వారితోనే కడిగించారు. 

పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.. కానీ 
వివరాల్లోకి వెళితే.. ‘రెడిట్’ అనే సోషల్ మీడియాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ మహిళ పంచుకోవడంతో ఈ పెళ్లి తంతు బయటకొచ్చింది.  ‘‘వధువు మా దగ్గర బంధువే. కానీ, వరుడి గురించి నాకు పెద్దగా తెలియదు. వాళ్లు పెళ్లి కోసం బాగానే ఖర్చు పెట్టారు. అందులో భాగంగా ఖరీదైన వేదికను అద్దెకు తీసుకుని,  అలంకరణ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా వేదికను అద్భుతంగా డెకరేట్‌ చేయించారు.  

పెళ్లికి వచ్చిన అతిథులకు విందు కోసం బఫెట్‌లోని ఫుడ్ కూడా చాలా టేస్టీగానే ఉందని తెలిపింది. ఇక్కడ వరకు అంతా బాగానే నడిచింది .ప్లేటు నిండా ఆహారం పెట్టుకుని ఆరగిస్తున్నాను. అయితే, నా భర్త ఖాళీ ప్లేటుతో నా దగ్గరకు వచ్చాడు. ఏమైందని అడిగితే ఫుడ్ అయిపోయిందని చెప్పాడు. దీంతో నేను వధువు తల్లి వద్దకు వెళ్లి అడగగా అందుకు ఆమె పుడ్‌ అయిపోయిందని, ఇక రాదని చెప్పడంతో మిగిలిన అతిథులంతా ఆకలితోనే పస్తులున్నారు’’ అని తెలిపింది.

ఖర్చు ఎక్కువైంది.. ఏమనుకోకుండా కాస్త ప్లేట్లు..
‘‘ఇక్కడ అసలు ట్విస్ట్‌ మొదలైంది. సరే ఉన్నదాంతో సరిపెట్టుకుని విందు చేశాక రిసెప్షన్‌ చూసేందుకు వెళ్లాం. ఇంతలో ఓ పని మనిషి మా వద్దకు వచ్చి కిచెన్‌లోకి రావాలని తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత కుప్పలా పడివున్న ప్లేట్లు, గ్లాసులు చూపించి కడగాలని చెప్పింది. ఒక్కసారిగా షాక్‌ తగిలి ఏంటని వధువు తల్లిని అడగగా.. పెళ్లి ఖర్చులన్నీ వధువు వెడ్డింగ్ గౌను, వేదిక, విందుకే అయిపోయానని, గిన్నెలు కడిగేందుకు మనుషులను పెట్టుకోలేకపోయామని సాఫీగా ఆమె సమాధానం ఇచ్చింది. ఇక చేసేదేమిలేక నేను, మరో తొమ్మిది మంది అతిథులం పెళ్లిలోని ప్లేట్లు కడిగాల్సి వచ్చింది.

పెళ్లి కోసం వచ్చి మొత్తం సమయాన్నంత మేం కిచెన్‌లోనే గడిపాల్సి వచ్చింది. ఈ ఘటన మూడేళ్ల క్రితం జరగగా, ప్రస్తుతం ఆ జంట విడాకులు కూడా తీసేసుకున్నారు. బహుశా అతిథుల అవమానపరిచనందుక ఫలితమేమో ఇది ఏమైనా!’ అని సదరు మహిళ చెప్పుకొచ్చింది. ఇది చదివిన నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ఇది చాలా చేదు అనుభవం. తినేందుకు సరిపడా పుడ్‌ లేకపోగా.. ప్లేట్లు కడిగించారు. అసలు వాళ్ల పెళ్లి గురించే ఆలోచించారే గానీ.. అతిథులను పట్టించుకోలేదు’’ అని ఒకరు. ‘‘నీ స్థానంలో నేను అక్కడ ఉంటే.. తక్షణమే పెళ్లి నుంచి పరారయ్యేవాడిని’’ అని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని వార్తలు