అప్పుల భారంతో దంపతుల ఆత్మహత్య

25 Jun, 2021 06:34 IST|Sakshi

పెంపుడు శునకాన్ని చంపే యత్నం..

ఇల్లు అమ్మి అప్పులు తీర్చాలని మిత్రుడికి మెసేజ్‌  

సాక్షి, చెన్నై: చెన్నై మందవేలిలో అప్పుల భారంతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాము పెంచకున్న శునాకాన్ని సైతం హతమార్చే యత్నం చేశారు. మందవేలి శివరామన్‌ వీధిలో లోకనాథన్‌ (52), శాంతి (48) దంపతులు జీవిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. ఇంటి వద్దే శాంతి పాల వ్యాపారం చేస్తుండగా, లోకనాథన్‌ కార్ల మెకానిక్‌షెడ్డులో పనిచేస్తున్నాడు. ఒక శునకాన్ని బిడ్డలా పెంచుకుంటున్నారు. కరోనా వల్ల పనిలేక పోవడం, పాల వ్యాపారం సాగకపోవడంతో అప్పులు చేశారు. అప్పుల భారం తీవ్రం కావడంతో బుధవారం బలవన్మరణానికి సిద్ధమయ్యారు.

అప్పుల బాధతో తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మిత్రుడికి ఫోన్‌ ద్వారా మెసేజ్‌ పంపించారు. ముందుగా తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకం ముఖానికి పాలిథిన్‌ కవర్‌ కట్టి ఊపిరి ఆడకుండా చేసి, తర్వాత ఇద్దరూ ఉరి వేసుకున్నారు. శునకం కవరును పంటితో కొరికి వేయడంతో ప్రాణాలతో బయట పడింది. మిత్రుడి నుంచి తనకు వచ్చిన మెస్సేజ్‌ను గురువారం ఉదయాన్నే చూసిన ధనపాల్‌ ఆందోళనతో లోకనాథన్‌ ఇంటికి పరుగులు తీశాడు. పోలీసులు, ఇరుగు పొరుగు వారి సాయంతో ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరు ఉరికి వేలాడుతున్నారు. స్పృహ తప్పి ఉన్న శునకానికి చికిత్స అందించారు. మృతిచెందిన దంపతులు మిత్రుడికి పంపిన మెసేజ్‌లో తమ ఇంటిని అమ్మి అప్పులు ఇచ్చిన వారికి డబ్బు చెల్లించాలని ఓ లిస్టును సైతం పెట్టినట్టు విచారణలో తేలింది.

చదవండి: టిక్‌ టాక్‌ స్టార్‌కు జైలు శిక్ష.. కాపాడమంటూ వేడుకోలు
రాత్రిళ్లు కల్లోకి వచ్చి నాపై అత్యాచారం చేస్తున్నాడు

మరిన్ని వార్తలు