‘మటన్‌’ విషయంలో భార్యాభర్తల గొడవ.. సర్దిచెప్పిన వ్యక్తి దారుణ హత్య

20 Oct, 2022 14:10 IST|Sakshi

భోపాల్‌: భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. చిన్న చిన్న విషయాలకు సైతం గొడవ పడినా.. మళ్లీ కలిసిపోతుంటారు. అయితే, ఇరువురు గొడవపడుతుంటే చుట్టుపక్కల వారు ఆపేందుకు ప్రయత్నించటమూ మామూలే. కానీ, ఒక్కోసారి అది ప్రాణాలపైకి తెస్తుందనేందుకు ఇదే సరైన ఉదాహరణ. భార్యాభర్తలు గొడవ పడుతున్నారని కలుగజేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. మా మధ్యకే వస్తావా అని దారుణంగా కొట్టి చంపాడు భర్త. ఈ అమానవీయ సంఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగింది.

పప్పు అనే వ్యక్తి మంగళవారం రోజు ఇంట్లో మటన్‌ కూర వండాలని భార్యకు చెప్పాడు. అయితే, మంగళవారం మాంసం తినకూడదని వాదించింది భార్య. ఈ విషయంపై ఇరువురు గొడవకు దిగారు. గొడవ పడుతున్న భార్యాభర్తలను గమనించిన పొరుగింటి వ్యక్తి బిల్లు.. వారి వద్దకు వెళ్లి సర్దిచెప్పాడు. తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. కానీ, బిల్లుపై కోపం పెంచుకున్న భర్త పప్పు.. అతడి ఇంటికి వెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో బిల్లు ప్రాణాలు కోల్పోయాడు. పప్పు భార్య ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అతడిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇదీ చదవండి: చికెన్‌ బిర్యానీ ఆర్డర్‌ చేస్తే మరొకటి ఇచ్చారని.. రెస్టారెంట్‌కు నిప్పుపెట్టిన మందుబాబు..  

మరిన్ని వార్తలు